Saturday, November 23, 2013

పెద్దల మాట సద్ది మూట


"పెద్దల( తల్లిదండ్రులు ) మాట సద్ది మూట" ఈ మాట చిన్నప్పుడే విన్న ఒక గొప్ప సామెత. అయితే వయసు పెరిగే కొద్ది వృద్ధాప్యం రాకూడదు, పెద్దరికం రావాలి అంటారు. అయితే మరి అలాంటి పెద్దిరికపు మాటలను నేటి పిల్లలు చాదస్తం అని అంటున్నారు . అలాగే పిల్లల కోరికలే పెద్దల సమస్యలు అంటారు, మరి పిల్లల కోరికల పట్ల పెద్దల ఆశక్తి చూపడం లేదు ఎందుకంటే అది తరాలు మధ్య గల అంతరాలు అని అంటున్నారు. మొత్తానికి పెద్దలకి పిల్లలకి మధ్య అంతరాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. వాటి ఫలితమే రోజురోజుకి నేటి సమాజంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి.  అసలు దీనికి మూల కారణం ఏమిటని నేను ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాను అయిన నాకు కారణం అంతు చిక్కడం లేదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది " తనని తాను తగ్గించికునేవాడు జీవితంలో హెచ్చించబడతాడు." అలాగే  నేను ఈ మధ్యన విడుదలైన "అత్తారింటికి దారేది" చిత్రంలో ఒక మాట నన్ను బాగా అలోచినంప చేసింది. ఆ మాట " ఎక్కడ నెగ్గాలోకాదురా , ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు". ఇలాంటి ప్రశ్నలకు కారణాలు అన్వేషించడం కన్నా పిల్లల ఎదుగుదలకు కారకులైన పెద్దలని గౌరవంచడం నిజమైన ప్రేమని అనుకోని ఈ బ్లాగ్ రాయడానికి ముందుకి వెళ్తున్నాను.

నాకు తెలిసి ప్రతీ మనిషి సాధారణంగా పదేళ్ళు వయసు వరకు తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతారు, పదేళ్ళ నుండి ఇరవై ఏళ్ళ వయసు వరకు ఎక్కువ సమయం స్నేహితులతో గడుపుతారు. ఇరవై ఏళ్ళ నుండి ముప్పై ఏళ్ళ వయసు వరకు ప్రియరాలు తోనే లేదా తన భార్యతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ముప్పై ఏళ్ళ నుండి నలబై ఏళ్ళ వరకు తన పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. నలబై నుండి యేభై ఏళ్ళ వరకు తన ఉద్యోగ కార్యకలాపాలతో ఎక్కువ సమయం గడుపుతారు. యేభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ వరకు పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇంకా మిగిలిన జీవితం ఆధ్యాత్మకంతో గడిపి తనువు చాలిస్తారు. ఇలా ఆలోచిస్తే ప్రతి మనిషి తను ఎదుగుతున్న మొదటి ముప్పై సంవత్సరాలలో మొదటి పది సంవత్సరాలు మాత్రమె తన తల్లిదండ్రులతో గడుపుతాడు. మిగతా కాలం అంతా తన స్నేహితులతోనే అలాగే తనకు కాబోయే భార్యతోనే ఎక్కువ సమయం గడుతాడు. అందుకేనోమో  తల్లిదండ్రులకి పిల్లల యొక్క వ్యక్తితత్వం కాని అలాగే వారి అభిరుచులను అంచనా వేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. పిల్లల పదేళ్ళ వయసు వచ్చేసరికి ఒక కంప్యూటర్, పదిహేనేళ్ళ వయసు వచ్చేసరికి ఒక సెల్ ఫోన్, వయసు ఇరవై దాటగానే ఒక మోటార్ బైక్ ఇలా వయసు తగ్గ వసుతులు కల్పిస్తున్నారు కానీ వయసుకి తగ్గట్టు వాళ్ళ మానసిక ఎదుగుదలను, వాళ్ళ అభిరుచులను తల్లిదండ్రులు గమనించడం లేదోమోని నాకు ఎప్పుడు అనిపిస్తుంది.

దీనికి అంతటికి మూల కారణం పదేళ్ల వయసు వరకు నీతికధలు, మానసిక వికాసకధలు చెప్పే తాతయ్య, నాన్నమ్మలు ఇంట్లో ఉండటం లేదు, మనిషి జీవితం అంటే ఇతరులతో కలిసి బ్రతకడం అని అర్ధం చేసుకోవడానికి ఇంట్లో అన్నదమ్ముల పిల్లలతో కలిసి ఉండటం లేదు. అవసరమైన చోట శారీరక శ్రమను తట్టుకొనే శక్తిని అలవాటు పరిచే వ్యాయమ, ఆటలతో విద్యార్ధిని అభివృద్ధి చేసే పాఠశాలలు నేడు లేవు. "మనం ఏది విత్తితే అదే కోస్తాం" అందుకే పిల్లల ముందు చేసే ప్రతిపని, ప్రతి మాట ఎప్పుడు గమనిస్తూనే వాటినుండే పిల్లలు పనిచేయడం, మాట్లాడటం నేర్చుకుంటారు. అందుకే సాధ్యమైనంతవరకు పిల్లల ముందు చెడు మాటలను, చెడు పనులకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎలాంటి తప్పిదాలు జరిగిన అవి చేతిమీద పచ్చబొట్టు వేసినట్లు పసి హృదయాలలో చెరగని ముద్రను వేస్తాయని గుర్తిస్తే పిల్లలకి, తల్లిదండ్రులకి ఇంత దూరం పెరిగి ఉండేవికాదని అనిపిస్తుంది. 

ఇక పిల్లల విషయానికి వస్తే మనకన్నా వయసు మళ్ళిన వాళ్ళని ఎప్పుడు గౌరవించాలని తెలుసు, అయిన నేటితరం వాళ్ళు తమయొక్క తల్లిదండ్రుల విషయంలో కూడా వారు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఇలాంటి సమయాల్లో చాలా మంది చెప్పినమాట నాకు తీరిక లేకపోవడం, కానీ దీనికి నేను ఏకీభవించను ఎందుకంటే వారికి తీరిక లేదు అనడం కన్నా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ప్రేమగా వ్యవహరించాలన్నా ఆలోచన లేకపోవడమే అని అనిపిస్తుంది . ప్రతి మనిషికి వృద్ధాప్యం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి, కాని నేటి తరం పిల్లలు అసలు వృద్ధులనే ఒక సమస్యగా పరిగనించడం వలన నేడు వృద్ధాశ్రమాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. నేను తొమ్మిదవ తరగతిలో ఇంగీష్ ఉపవాచకంలో ఒక పాఠం ఇప్పటికి నాకు బాగా గుర్తు, ఆ పాఠం పేరు నాకు గుర్తు లేదు కానీ, ఆ పాఠం సారాంశాన్ని మాత్రం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఒకానొక దేశంలో ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యం చక్రవర్తి ఆకస్మిక మరణం వలన, యువరాజుని ఆ రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తారు. కొద్ది రోజులలో, యవ్వనంలో ఉన్న ఆ చక్రవర్తి దేశంలో అందరు యవ్వనస్తులే ఉండాలి, ఎల్లప్పుడూ ఈ రాజ్యం యవ్వనస్తులతో మంచి ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలని ఆ రాజ్య ప్రజలకి ఆజ్ఞాపించాడు. రాజ్యంలో ఎక్కడైనా ముసలివాళ్ళు కనిపిస్తే వాళ్ళని వెంటనే చంపిస్తానని ఆజ్ఞాపించాడు. దీనితో రాజ్యంలో ఉన్న ప్రజలు భయభ్రాంతులకి లోనై ఎవరింట్లో నున్న ముసలివాళ్ళను ఆ రాజ్యాన్ని దాటించారు. అప్పటినుండి ఆ రాజ్యం అంతా యవ్వనస్తులతో కూడి ఎంతో సంతోషంగా జీవించసాగారు. ఇలా ఒక అయిదు సంవత్సరాలు గడిచిన తరువాత ఆ రాజ్యంలో పెద్ద కరువు వచ్చింది, ఆ రాజ్యంలో ఎక్కడ పంటలు పండలేదు, ఇక తరువాత సంవత్సరం కూడా పంటలు ఎక్కడ పండలేదు. ఇక రాజ్యంలో ఉన్నవాళ్ళు ఎలా బ్రతకాలని మేధోమధనం చేయగా అందులో ఒకరు రాజుగారికి " అయ్యా! ఇంత కరువు కాలంలో కూడా మన రాజ్యంలో ఒకతను మాత్రం పంటలు చక్కగా పండించాడు". మనం అతనిని విచారించి మన రాజ్యంలో ఇక పంటలు ఎలా పండించాలో తెలుసుకుందాం అని వివరించగా, ఆ చక్రవర్తి పంటలు పండించిన యువకుడుని పిలిపించమని తన మహామంత్రికి చెబుతాడు. మొత్తానికి ఆ పంటలు పండించే వ్యక్తిని అడగగా, నేను ఇంత బాగా పంటలు పండించడానికి కారణం నేను నా తండ్రిని నా ఇంట్లో దాచిపెట్టాను. అయన యొక్క అనుభవాల సారంతోనే  నేను పంటలు పండించ గలిగాను అని చెప్పిన తరువాత ఆ చక్రవర్తి తను చేసిన తప్పును తెలుసుకొని మరల ఆ రాజ్యానికి చెందిన ముసలి వాళ్ళందర్నీ మరల వెనుకకు పిలుపించుకొని అందరు కలిసి సంతోషంగా జీవనం సాగించారు.
నేను పై కధనుండి ఒక విషయం మాత్రం నేర్చుకున్నాను. "ప్రతీ యువకలు కొత్త టెక్నాలజీని చాలా సులభంగా నేర్చుకోనగలరు, అదే కొత్త మనుషులతో సత్సంబంధాలు ఏర్పురచు కోవాలంటే మాత్రం కొన్ని సార్లు తడబడుతారు, మనం కొన్ని పనులే చేయాలంటే కొన్ని సార్లు శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలి, దీనికి మాత్రం అనుభవం కావలి. అలాంటి అనుభవాలనే మన తల్లిదండ్రులు మనకు ఎప్పుడు చెబుతారు అది వినడానికి కొన్ని సార్లు చాదస్తం కావచ్చు కానీ ఆలోచిస్తే మాత్రం అందులో చాల నేర్చుకోదగ్గ విషయాలు ఉంటాయనేది మాత్రం నగ్నసత్యం"  

నేను చివిరిగా ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను " మనం చిన్నతనంలో ఎంత మారం చేసిన వాళ్ళు ప్రేమతో మనల్ని, మన అల్లర్ని భరిస్తారు అలాగే వాళ్ళు ముసలివాళ్ళు అయిన తరువాత వాళ్ళు చేసిన పనులు, మాటలు మనకు చాదస్తం అనిపించినా మనం కూడా అంతే ప్రేమతో వాళ్ళని ప్రేమించాలి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చేకొద్దీ మన పిల్లలగానే భావిస్తే ప్రతీ ఇల్లు స్వర్గాధామమే....       

Wednesday, September 18, 2013

నా కోపం.... !

 కోపం మీద రాసిన బ్లాగ్ ఇది అంతే కానీ కోపంతో రాసినది కాదు. ఎందుకంటే సంతోషం లేదా బాధ గురించైనా చెప్పవచ్చు అలాగే మనకి ఎదురైనా సమస్య  లేదా మనసులోని సంఘర్షణ గురించైనా చెప్పవచ్చు. కారణం వీటితో మనిషి కొంత కాలం ప్రయాణం చేస్తాడు. అదే కోపం గురించి మాత్రం చెప్పలేము ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనిషి తన అదుపులో తను ఉండలేడు, అందుకే మనిషి జీవితంలో అతి తక్కువ కాలం ఉంటుంది, కాని దానివలన వచ్చిన అనర్ధం అతి ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే కోపంతో రాసిన బ్లాగ్ మాత్రం కాదు ఇది, కోపం మీద రాసిన బ్లాగ్ ఇది.  జల్సా సినమా లో మొదటిలో ఒక డైలగ్ ఉంది, అది నన్ను బాగా ఆలోచింపచేసింది.
               " మన దేశంలో లక్ష మందిలో ఒకరికి సొంత బంగ్లా ఉంది... 
                 1000 మందిలో ఒకరికి సొంత కారు ఉంది .... 
                 100 మందిలో ఒకరికి సొంత కంప్యూటర్ ఉంది... 
                 కానీ ప్రతి 10 మందిలో ఇద్దరి దగ్గర తుపాకి కానీ కత్తి కానీ ఉంది... 
                 అంటే ఇక్కడ మనకి బ్రతికే అవకాశం కంటే చచ్చే సౌకర్యం ఎక్కువ..."

పైన చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు కానీ ఈ దేశంలో ఆకలి ఉన్నవాళ్ళకన్నా, ఆయుధాలు ఉన్నవాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని అనేది మాత్రం వాస్తవం. దీనికి నిదర్శనం తేది 26-08-13 న హైదరాబాద్ SR నగర్ లో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ. తుపాకి టెస్టింగ్ కోసం రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే వ్యక్తిని (పి. అశోక్) నిర్ధాక్ష్యణంగా కాల్చివేసారు.  నేను ఈ సంఘటన గుర్తుచేయడానికి కారణం, సరదా  కోసం ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంటే, అదే ఆ వ్యక్తి కోపంలో ఉంటె ఇంకా ఎంత అనర్ధం జరుగుతుందో చెప్పనవసరం లేదు. అందుకే  ఆవేసమున్న వాడికి ఆకలి వేస్తె ఆకలి తీరుతుంది. అదే ఆవేసమున్న వాడకి ఆయుధం ఉంటె మాత్రం అనర్ధం జరుగుతుంది. నేరస్తులందరూ మొదట ఆవేశంతో తప్పు చేసినవారే, తరువాత ఈ సమాజం వారిని ఇంకా నేరస్తులుగా తయారు చేస్తుంది. అందుకే నేను అనుకుంటాను ఆవేశం కోపంగా మారకముందు దానిని తగ్గించుకోవాలి అలాగే కోపం కసిగా  ముందే దానిని తగ్గించుకోవాలి, లేదంటే ఆ కసే ఆ మనిషిని కసాయి వాడిగా చేస్తుంది చివరికి ఆ కసాయివాడే ఏదో ఒక రోజు కరుడగట్టిన నేరస్తుడు అవుతాడు. అయితే ఈ లోకంలో కోపం రాని మనిషి ఉండడు, అలాగే కోపం తెప్పించే సంఘటన ఎదురుకాని జీవితం ఉండదు. అందుకే నేను ఈ బ్లాగ్ లో వచ్చిన కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో మాత్రం రాయదలచుకున్నను.

సహజంగా నాకు కూడా కాస్త కోపం ఎక్కువగా ఉండేది. కాలంతో పాటు ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేసాను. అయితే ఉద్యోగం జాయిన్ అయిన తరువాత కొన్ని సందర్భాలలో కోపాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. ఎందుకంటే మనం కొన్ని పనులు చేయించు కోవడానికి లేదా ఆ పని జరగకపోవడం వలన మనకు కలిగిన వత్తిడిని క్రిందస్తాయి ఉద్యోగులకు తెలయచేయడానికి కోపం ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే నాకు ఇది తాత్కాలికంగా పని వత్తిడిని తగ్గించవచ్చు కానీ శాస్వతంగా మాత్రం నా ఆరోగ్యాన్ని అలాగే నా చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన సంబంధాలు పైన మాత్రం ప్రభావం చూపింది. అందుకే మనం ఏ పనైనా ప్రేమతో చేయించుకోవాలి కానీ కోపంతో మాత్రం కాదు.

నేను ఒక పుస్తకంలో చదివాను,  మనిషి మనసు ఒక తోట లాంటిది, ఆ మనసుకి కనక మనం నీరు పోసి, విత్తనాలు మొక్కలు నాటి ఓకే తోటను పెంచినట్లు పెంచి పోషిస్తే మనం ఊహించనదాని కంటే ఎక్కువ ఎక్కువ ఫలితాలను రాణిస్తుంది. అదే మనం కలుపు మొక్కలను రానిస్తే మనకు శాశ్వత మనశ్శాంతి, అంతరంగిక సామరస్యం అన్నవి ఎప్పటికి అందనివే అయిపోతాయి. నిజమైన తోటమాలి తన తోటను మాత్రం సైనుకుడిలా కాపాడుకుంటాడు, బయట నుంచి ఎలాంటి కాలుష్యం లోనికి రాకుండా. కాని మనషి మాత్రం నిత్యం తన మనసనే సారవంతమైన తోటలోకి ఎన్నో విషపదార్ధాలను రానిస్తాడో. ఆందోళనలు, విచారాలు, గతించిన జ్ఞాపకాలు ఇలా ఎన్నో తన అంతర ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి అనవసరమైన భయాలతో పాటు అవి ఎవరి వలన కలుగుతున్నాయో వారి మీద కోపాన్ని అలాగే కసిని పెంచుకుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే "కోపం లేదా ఆందోళనకరమైన ఏ ఆలోచన అయిన పిండం లాంటిది. అది చిన్నదిగానే ప్రారంభమవుతుందిగానీ క్రమంగా పెద్దదవుతుంది, చివరకు ఒక ప్రాణిగా రూపుదిద్దుకొని ఆ మనిషినే తినేస్తుంది."   

అందుకే నేను కోపం వచ్చే ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఇంకా మంచి ఆలోచనలతో లేదా నాకు సంతోషం కలిగించే ఆలోచనలతో మార్చుకొని (Replace) నా మనసులోని భావ ఆవేశాలను కంట్రోల్ చేసుకుంటాను. అలాగే ఎవరైనా నాకు కోపం తెప్పిస్తే వాళ్ళు ఇంతకు ముందు నాపట్ల చేసిన మంచి పనులను కానీ వారు చూపిన ప్రేమాభిమానాలను గుర్తుచేసుకొని నాలో రగిలిన కోపావేశాలను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తాను. ఇలా అన్ని సందర్భాలలో సఫిలికృతం కాలేకపోవచ్చు కానీ కొన్ని సమయాలలో కోపం తగ్గించుకొనే ప్రయత్నం చేసాను. కోపం మనిషికి ఒక శాపం కావచ్చు, కానీ అది ప్రదర్శించి పాపాన్ని మూట కట్టుకోవద్దు. మన జీవితంలో ప్రేమ అనే పునాదితో ఇల్లును కట్టుకోండి, ఆ ఇల్లు నిజంగా ప్రశాంతనిలయంగా మారుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.  

Saturday, August 31, 2013

అంధకారంలో ఆంధ్రులు...


" కులములేల్ల కూలి పోవు..., మతములేల్ల మాసి పోవు
లోకమెల్లా ఏకమై కలిసిపోవు ...." అన్న గురజాడ గుండెకు నేడు గాయం చేస్తున్నారు .....
"తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది...
ప్రాంతాలు వేరుగా ఉన్న మన అంతరంగమొకటేనన్నా... "
అన్న సిరిసిల్ల సినారె మాటలకు నేడు చిన్న చూపు చూస్తున్నారు....
తెలుగు తన వెలుగనుకోని తనువు చాలించిన శ్రీ పొట్టి శ్రీరాముల
ఆశయాలను నేడు తలగోరివి పెడుతున్నారు...
ఆకలేసి కేకలేస్తే కాకులమని ( సీమంధ్రులను )
కూత నేర్చిగానం (తెలంగాణం ) చేస్తే కోకిలని తీర్పు తీర్చిన స్వార్ద రాజకీయ నాయకలు..
పాలకడలిపైన పవ్వళించినవాడికి గొల్ల ఇండ్ల పాలు కోరనేలా ....
ప్రగతి పధంలో ముందున్న హైదరాబాద్ కి ప్రత్యేక రాష్ట్రమిచ్చుటనేలా  ....
నెగ్గింది నీతిలేని రాజకీయ నాయకలు....
ఓడింది మాత్రం అమాయక ఆంద్ర ప్రజలు...
అందుకే ....
కలిసిరండి కదలిరండి సమైక్యాంధ్ర  కోసం ...
విభేదాలను, భిన్న విధానాలను వదలి
భిన్నత్వంలో ఏకత్వమై, ఏకత్వంలో సమానత్వమై...
సమానత్వంతో సకల జనులు సజ్జనలు వలె కలిసి
ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం...
మనం సమాఖ్యంధ్రులమని ... స్వార్ధం లేని అన్నదమ్ములమని


Wednesday, July 17, 2013

ఓటమి...

                   ఓటమి అంటే విజయం వరించకపోవడం అది ఆటలోనైన, బ్రతుకుబాటలోనైన, ఓటమి అంటే చేరుకోవలేకపోవడం అది సరియైన సమయానికి  సరియైన స్థానమైన లేదా గమ్యమైన కావచ్చు, ఓటమి అంటే గెలుచుకోలేకపోవడం అది మనసైన, లేదా మనీ అయినకావచ్చు. అందుకే ఓటమి అంటే మనిషికి ఒక  కష్టం, కష్టంలోంచి  బాధని, బాధలోంచి భయాన్ని, భయంలోంచి భవిష్యత్ని చూస్తాడు, అందుకే ఓటమి వస్తే మని
షి  కృంగిపోతాడు. విజయం రాకపోతే బాధతో మనసు రగిలిపోతుంది, గుండె పగిలిపోతుంది, అందుకే మనిషికి నాకే ఎందుకు ఇలా జరిగిందని కోపం, ఆ కోపంలోనుండి ఆవేదన, ఆ ఆవేదన నుండి ఆవేశం,  ఆ ఆవేశం నుండి ఆక్రోశంతో మనిషి తల్లిడిల్లిపోతాడు. అయితే ఈ మధ్య నేను ఒక మాట చదివా " ఈ శృష్టిలో ఏ తప్పు లేదు, తప్పంతా మన దృష్టిలోనే ఉంది... ".  ఇలా ఆలోచిస్తే ఓటమి వలన గొప్ప బాధ ఉంది, అలాగే గొప్ప భవిష్యత్ ఉంది. ఓటమి వలన భయమూ పెరుగుతుంది, అలాగే మరల ఆ పని చేయడంలో భక్తి పెరుగుతుంది. ఓటమి వలన మనసుకి మధనం ఉంది, ఆలోచిస్తే ఆ మధనం నుండి గొప్ప మధురం ఉంది. అందుకే నేను అనుకుంటాను, ఓటమి వలన మనసుకి ఓర్పు, పనిలో ఒక నేర్పు, జీవన విధానంలో  ఒక మార్పు, ఇలా చివరికి జీవితంలో సంతోషాల కూర్పుతో పాటు మనకు సమాజంలో ఒక మంచి తీర్పుని ఇస్తుంది. ఇలా నేను చెప్పడానికి కారణం నిత్య జీవితంలో జరిగిన సంఘటనలే కారణం, అలాంటి కొన్ని సంఘటనలను నా మాటలలో మీ ముందు ఉంచాలని ఈ బ్లాగ్ సారంశం.
            సాధారణంగా  మనిషికి  ఓటమి ఎన్ని సార్లు ప్రయత్నించిన సఫలం కాలేకపోవడం లేదా సంతోషంగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ఆకస్మిక సంఘటన ఎదురుకావడం లేదా ఆనారోగ్యంతో అనుకున్న పనిని సాధించక పోవడంలాంటివి జరుగుతుంటాయి. పై చెప్పిన మూడు సంఘటనలకు నేను చదివిన లేదా నాకు తెలిసిన సంఘటనలు మీ ముందుంచు తున్నాను.


            మొదటగా ఒక ప్రపంచ ప్రఖ్యాత ఫోటో గ్రాఫర్ని ఇంటర్వ్యులో " మీరు ప్రపంచ ప్రాచుర్యం పొందే ఫోటోలను ఎలా తీస్తున్నారు ? అని అడిగితే అయన వినయంగా నేను ఒక ఫోటోని సూమారు 1000 సార్లు తీస్తాను, అంటే నేను ఒక ఫోటో తీయడానికి 999 సార్లు ఓడిపోతాను సమాధానం ఇచ్చారట " ఇక్కడ ఆ ఫోటో గ్రాఫర్ ఫోటోని ఎలా తీయాలో తెలియక 999 సార్లు విఫలమైయుండవచ్చు కాని ప్రయత్నం చేయడంలో ఎప్పుడు అతను విఫలం కాలేదు. అందుకే అంటారు "ఓటమి విజయానికి మొదటి మెట్టు". మనం ఎన్ని సార్లు ఓడితే అన్ని మెట్లు పైకి ఎక్కగలం. ఓటమి కూడా మనిషికి గెలుపువలే ఒక సాధారణం అని గమినించి ఓటమి రావడానికి గల లోపాలను సరి చేసుకొని ముందుకు వెళితే తప్పక ఆ ఓటమి వలన మనలో ఒక మంచి మార్పుని తద్వారా ఒక చిరస్మరణీయమైన గెలుపుని సొంతం చేసుకొనవచ్చును.
       రెండవదిగా సాఫీగా సాగుతున్న జీవితంలో అనుకోని ఆకస్మిక సంఘటన ఎదురైతే మనం ఒక్కసారి మనం కుప్పకూలిపొతాం, అలాగే చేయవలిసిన పనులను వదిలేసి  విచారంతో విలపిస్తూ జీవితాని గడిపేస్తాం. కానీ దీనికి భిన్నంగా ఒక పడతి తన జీవితంలో అనుకోని ఆకస్మిక సంఘటనకి ఎలా స్పందిన్చిందో ఈ సంఘటన చదివితే తెలుస్తుంది.  డిసెంబరు 9, 1979 న అమెరికా లోని ఉత్తర ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ తల్లి కళ్ళెదుటే తన 18 ఏళ్ళ బిడ్డను ప్రమాదంలో కోల్పోయింది. రోడ్డు దాటుతుండగా 19 ఏళ్ళ డ్రైవర్ తాగిన మైకంలో కారుతో గుద్ది చావుకు కారణమయ్యాడు. ఆమె పేరు Beckie Brown. తన కడుపుకోత వేదనను క్రోధంగా, కన్నీటిగా జార్చలేదు ఆ తల్లి. తాగి వాహనం నడిపే చర్యకు వ్యతిరేకంగా ఒక సంస్థను నెలకొల్పింది. అదే MADD (Mothers Against Drunk Driving). ప్రభుత్వం మీద, వ్యవస్థలో లోపాల మీద, తాగుబోతుల మీద ఒకరకంగా యుద్ధం ప్రకటించింది. ఆమె కారణం గా చట్టాలు మారాయి. మరెన్నో విజయాలతో పాటు ఇప్పటివరకూ 3 లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఘనత సొంతం చేసుకుంది. ఎంతగొప్పవిషయం ఇది.. ఒక సాధారణ తల్లి కే ఇంత విజయం సాధ్యమైతే.. అందరం ఆశ్చర్యపోతాం. మెచ్చుకుంటాం.. వీలైతే చేయందిస్తాం..  కానీ అదే స్థానంలో మనం ఉంటె మాధనంతో మంచం పట్టి జీవితాన్ని నిరుపయోగంగా గడిపేస్తాం. అందుకే నేను అనుకుంటాను "గెలుపు రాదనుకోవడం నిరాశ, అలాగే ఎప్పుడు గెలుపు రావాలనుకోవడం దురాశ "



      ఇక మూడవదిగా ఎప్పుడైనా అనారోగ్యం వస్తే ఇక మన జీవితమింతే, మనకు ఇలానే రాసిపెట్టి ఉన్నాదని బాధపడుతూ కాలాన్ని గడిపేస్తాం. కానీ జీన్ - డామినిక్ బాబి కధ చదవండి " ఈయన పారిస్ లో ఎల్లె మ్యాగజిన్ కు ముఖ్య సంపాదకుడుగా ఉండేవాడు. ఒక రోజు అతని కొడుకుని కారులో ఊర్లో తిప్పుతుంటే, ఉన్నట్టుండి తీవ్రంగా గుండెపోటు వచ్చి తన కారు వెనుక సీటులో పడిపోయాడు. ఇలా మొత్తానికి అయన మూడు వారల తరువాత కొమలోంచి కోలుకున్నాడు కాని మాట పడిపోయింది, దాదాపు చెవిటి వాడయ్యాడు, చివరికి పక్షవాతం కూడా వచ్చి, తని శరీరంలో ఏ భాగం కూడా కదపలేడు ఒక్క ఎడమ కనురెప్ప తప్ప. అతనికి అంతులేని ఆశ, సానుకూల భావం, ఏదో ప్రత్యేకంగా చేయాలన్న గట్టి పట్టుదల ఉండేది. అందుకని జీన్ - డామినిక్ కదలలేకపోయినా, ఒక పుస్తకం రాసే మార్గాన్ని వెతుక్కోవాలని అనుకున్నాడు. తద్వారా దుఃఖం నుండి తను నేర్చుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలని అనుకున్నాడు. చివిరికి తన ఆసుపత్రి గదిలో ఒక సంపాదకుడిని రోజుకి మూడు గంటలు కూర్చుండబెట్టుకొని, తన కనురెప్పల కదిలిక సంఖ్యని బట్టి అక్షరాలన్ని నిర్దేశిస్తూ ఒక పుస్తకం రాసాడట. పేపరు కధనం ప్రకారం 137 పేజీల పుస్తకాన్ని తయారు చేయటానికి  జీన్ - డామినిక్ 200000 సార్లకన్నా ఎక్కువే ఆడించి ఉంటాడని పేర్కొంది." ఇది నిజంగా నన్ను కదిలించిన ఉదాహరణ. ఆలోచిస్తే అనిపిస్తుంది "ఓటమి ఎప్పుడు జీవితానికి ముగింపు కాదు, విజయం ఎప్పుడు ఆ జీవితానికి గమ్యం కాదు". అందుకే మనిషి నిత్యమూ పోరాడుతూ అందులో ఓడుతూ పోతే గెలుపు తనంతట తానే మనల్ని వరిస్తుంది. ఎందుకంటే " గెలుపు గురించి అతిగా ఆలోచించనవసరం లేదు కానీ వచ్చిన అవకాశం మాత్రం సద్వినియోగం చేసుకుంటే మనం గెలుపు కోసం ప్రయత్నం చేసినట్లే "  

 అందుకే అందరు కూచొని ఆపదలు చూసేచోటే మనం అవకాశం వెదుక్కోవాలి, అందరు కూచొని దుఃఖించే చోటే మనం ఆశా భావం కలిగి ఉండాలి, అందురూ చీకటిని చూసే చోటే మనం వెలుగుని చూడగలగాలి. అప్పుడే మనకు కష్టం కూడా ఇష్టంగా ఉంటుంది, సమస్యల్లో కూడా సంతోషంగా ముందుకు సాగిపోతాం, బాధలలో కూడా ధైర్యంగా భవిష్యత్ గురించి ఆలోచించగలం. చివిరిగా నేను ఒక సినిమాలో మాట చెప్పి ముగిస్తాను" గెలుపులో ఏముందిరా...? మహా అయితే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అదే ఒక్కసారి ఓడిపోయి చూడు... ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయం చేస్తుంది."    

Monday, April 8, 2013

జీవితం....

జీవితం అంటే కలల సమూహం, నెరవేరిన కలల గురించి చెబితే అది మన జీవిత చరిత్ర అదే నెరవేరని వాటి గురించి చెబితే అది మన జీవిత అనుభవం. అందుకే నేను కూడా జీవితం అంటే ఎలా ఉండాలని ఎప్పుడు కలలు కనే వాడిని కానీ దాని కోసం ఏమి చేయాలో మాత్రం ఆలోచించేవాడిని   కాను. నేను కనిన  కలలును కనక రాసుకొని ఉంటె ఏకంగా పుస్తకం అయ్యేది, అలాగే  తీరిన కలలు ఒక రాస్తే అవి ఒక పుట కూడా పూర్తికాదు. గంతించిన జీవితాన్ని చూస్తే చెప్పుకోదగ్గ విజయాలు లేవు అలా అని ఓడిపోయినా అనుభవం లేదు. ఎందుకంటే నేను అసలు ప్రయత్నం చేయలేదు ఒక వేళ ప్రయత్నం చేసిన, నా లోని శక్తీ సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించక పొవటమే.


నేను ఒక్కసారి  జీవితం లో వెనిక్కి చూసుకుంటే మిగిలింది శూన్యం మాత్రమే. నాకు నా జీవితం  మీద ఇలా ఆలోచన ఉంటె, ఇంకొకరికి మరోలా ఉండవచ్చు. ఇంతవరకు నేను చదివిన లేదా నాకు తెలిసిన జీవిత నిర్వచనాలలో మొదటిగా జీవితమనేది ఒక చదరంగం
" ఈ భూమి ఒక చదరంగపు బల్ల అయితే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి ఒక పావులాంటివాడు, అయితే విధి ఆడే వింత ఆటలో ప్రతి మనిషి పావుల కదులుతూ తన జీవితాన్ని ముగిస్తాడు ..."
రెండవది గా జీవితమనేది ఒక నాటకం.....
" ఈ భూమి అనేది ఒక రంగస్థలం అనుకుంటే ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవుడు ఒక పాత్రదారుడే, అయితే దేవుడు చేసే కధనం లో ఎవరి పాత్రలలో వారు జీవించి చివరికి తనువు చాలిస్తారు ..."
పైన చెప్పినట్లు మనిషి కొన్ని సార్లు నటిస్తూ..., మరి కొన్ని సార్లు ధనం కోసం, ఆస్తి కోసం ఎత్తుకి పైఎత్తులు వేస్తూ తమ జీవితాల్ని వెలిబుస్తారు. అందుకే కొన్ని సార్లు జీవితమంటే నాకు ఒకే ఒక మాట గుర్తుకువస్తుంది. అదే " జీవితమంటే జీతం" అందుకేనోమే జీవితం అనే  పదంలో జీతం అనే పదం చక్కగా ఇమిడిపోయింది. మనిషి ఎలాంటి సంఘ పరిస్థితలలొ పెరిగిన, లేదా జీవించన, ఎలాంటి మత పరమైన ఆచార వ్యవహారాలను కలిగి వున్నా,  ఈ భూమి మీద ఏ ప్రదేశాలలో నివసిస్తున్నప్పటికి, చివరికి వారు డబ్బు కోసం, డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకేనోమో ఈ సమాజంలో జీతం ఎక్కువ ఉన్నవారికి, అలాగే డబ్బు ఉన్నవారి జీవితాలను ఈ సమాజంలో జీవితాలుగా గుర్తిస్తున్నారు, వారినే గౌరవిస్తున్నారు, వారినే అనుసరిస్తున్నారు.

" విజయం సాధించిన ఎవరి చరిత్ర చదివిన, అంటే గొప్పవాళ్ళ కన్నా గొప్ప వాళ్ళు, గొప్ప సాహసవంతులు, గొప్ప శాస్త్రవేత్తలు, వారు ఏమి సాధించిన డబ్బుని ఆశించి చేయలేదు. అందుకే ఈ భూమి మీద మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, థామస్ అల్వ ఎడిసన్ వారిని ఈ ప్రపంచం గుర్తించుకున్నట్టు టాటా, బిర్లా, అంబానీ లను ఈ ప్రపంచం గుర్తించుకోదు." డబ్బు మనిషికి సౌకర్యాలను, తాత్కాలిక సంతోషాలను అందివ్వగలదు కానీ మనిషికి సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. అందుకే జీవితం అంటే జీతం కాదు, జీవితం అంటే జీవం, జీవం అంటే మన శక్తీ సామర్ధ్యాలను పూర్తి స్తాయిలో ఉపయోగించి జీవించడం అలా ఉపయోగించప్పుడు మనం మనుషులగా బ్రతికి ఉన్న మరణించినట్లే... 

సాధారణంగా అందరు నాకు అంత శక్తీ సామర్ధ్యాలు లేవు, మనం ఇంత కష్టమైనవి సాధించలేము అని కుంటారు. కానీ నిజానికి మనం ప్రతి ఒక్కరం మెధవులమే... కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అందరం అతి సాధారణ మైన వ్యక్తిగా మరణిస్తాము. ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పదలచుకున్నను. సాధారణంగా పంది బ్రతికినంత కాలం క్రిందకి చూస్తూ బురదలలోను, మురుకి కాలువల లోను తిరిగుతూ బ్రతుకుతుంది. ఎప్పుడయితే ఆ పంది కాళ్ళని కట్టివేసి, తలక్రిందులుగా వేలాడదీసి చంపడానికి తీసుకేల్తున్నప్పుడు అది మొదట సారి ఆకాశాన్ని చూస్తుంది. అప్పుడు ఆ పంది మొదట సారి బాధ పడుతుంది, ఇంతవరకు ఇంత గొప్ప లోకంలో ఏమి చూడకుండా, ఏమి అనుభవించకుండా, ఏమి సాధించకుండా  చనిపోతున్నాని   చివరి నిమిషంలో చింతుస్తుంది. మనిషి చనిపోతున్నని తెలిసిన చివర ఐదు నిమిషాలలో ఉన్నప్పుడు, తను సాధించిన విజయాలు గుర్తుకు రావు, తనలో శక్తీ, సామర్ధ్యాలు కలిగిన పనులు చేయలేకపోయానని చింతిస్తాడు. 
అందుకే జీవితమంటే జీతంతో బ్రతకడం కాదు. మన శక్తీ సామర్ధ్యాలతో బ్రతకడం, అయితే అన్ని సందర్భాలలో మన శక్తీ సామర్ధ్యాలను ఉపయోగించలేక పోవచ్చును. అయినంత మాత్రాన  మనం ఓడినట్టు కాదు. అయితే ప్రతి పనిని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, నవ్వుతు, నవ్విస్తూ, జీవితంలో ప్రతి క్షణం సంతోషిస్తూ ముందుకు వెళితే మన జీవిత చివరి ఘడియలలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అలాగే బాధ పడాల్సిన పని ఉండదు. జీవితం మాటలలో చెప్పడం సులువే, కాని ఆచరణలో కష్టమే, అందుకే  ఆగండి..., అర నిమిషం ఆలోచించండి...., మీకు ఆనందమైతే  ఆచరించండి..... 

Tuesday, March 19, 2013

నా 'నీ'రు ఇచ్చెదెవరు....


                                                  నారు పోసేవాడు పోయడా నీరు ?
                                  అలాగైతే మరెందుకు మన నీరు - మీరు 
                                    బావి బోరులలో నిండుకున్నది నీరు... 
                                   జన జీవనావలికి అండనున్నదెవరు ... 
                                 అడగకుండానే అమృతం అందించగలరు ... 
                                  కానీ అడిగిన అప్పుగానైన ఇవ్వరు నీరు... 

                               దిక్కు దిక్కున ఉన్న నీటి చుక్క చుక్కను
                       నిలకడ చేసి నిరంతరం కొరత కోరలను కట్టడి చేయండి ... 
                              లేకపోతే ముందున్నది బహు నీటి కొరత.... 
                                అప్పుడు పెట్టక తప్పుడు నీటికి కొలత... 
                            అలాగైతే జన జీవన చక్రం పడక తప్పదు బోల్తా..... 

                         చేయి చేయి కలిపి నడుమ కట్టాలి మనమంతా .... 
                   చినుకు చినుకుతో చెలిమి చేసి కలిమి కావలి చేరువులంత..
           నీరు కారిపోవాలి నీ నా బలహీనత, నీరు నిలబెట్టాలి నీ చేయూత 
                               ఇక కొరత చింతలు ఉండవు మీ చెంత...... 

(గమనిక: నీరు- మీరు అనేది ఒకప్పటికి ప్రభుత్వ పధకం,)






Monday, February 11, 2013

ప్రేమంటే....

ప్రేమంటే...ఒక మాటలోనో ఒక పాటలోనో అలాగే ఒక పూటలోను, ఒక పుటలోను చెప్పలేమని తెలిసిన ప్రేమను  పుటలోను రాయడానికి ప్రయత్నం చేశాను...

ప్రేమంటే ప్రేమించిన వారి చుట్టూ ప్రదర్శన చేయడం కాదు,
పరవశంతో పదునైన పదాలతో కవితలు రాయడం కాదు,
ప్రేమంటే పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకోవడం కాదు,
అది విఫలమైతే పురుగల మందు తాగి జీవితాన్ని ముగించడం కాదు....
అసలు ప్రేమంటే....
"ప్రేమంటే ప్రేమించిన వారికి స్వేచ్చని ఇవ్వాలి.....
కొన్ని సార్లు చెడు స్నేహలనుండి వారిని బంధించాలి....
వారికోసం  త్యాగంతో కొన్ని వదులుకోవాలి...
వారికోసం కష్టపడి కొన్ని సాధించాలి..
ఆపదలో వారి కోసం ఆసరాగా నిలబడాలి....
అపవాదులతో హేళనపాలైతే వారి కోసం కలబడాలి...
ప్రేమించిన వారిపైన శ్రద్ధ చూపాలి...
ప్రేమించిన వారికి సమయాన్ని కేటాయించాలి...
ఇంకో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమంటే ఒక పవిత్ర ప్రమాణం...
ఆ పవిత్ర ప్రమాణం ఉంటె జీవితం ఒక సంతోష ప్రయాణం...."






Monday, January 7, 2013

పురుషోత్తమలకు ఒక మనవి....

గోరుముద్దలు పెట్టి గోరింతవాడిని కొండంత వాడిని చేసిది ఒక ఇంతియే...
 బుడి బుడి అడుగులు నుండి వడివడిగా అడుగులు నేర్పేది ఒక వనితనే....   
అక్షరాల నేర్చిన నుండి అత్యున్నత స్తాయి చేరే వరకు మన వెనుక అమ్మలా                                                                                           ఉండేది ఒక అబలనే.....
నిరంతర నిర్విరామ పనులతో నిదురలేక అలసినప్పుడు తన చల్లని ఒడిలో నిద్రపుచ్చేది                                                                             ఒక నారిమణి నే...
ఆనందంతో తన అక్కున చేరుచుకొని మనల్ని ఆనందతీరాలకు చేర్చేది ఒక అపురూప ఆడదినే...
అనారోగ్యంతో అడుగు కూడా వేయలేనప్పుడు అహర్నిశలు మనకు సేవచేసేది ఒక స్త్రీ మూర్తినే...
ఇలా మగవాడి ప్రతీ ప్రగతి లోను ప్రక్కనుండేది ఒక పడతియే...                                               కష్ట కడలి లో కంటికి కనురెప్పలా  కాపాడేది ఒక కాంతామణియే...
అలాంటి స్త్రీ జాతి పైన పురుషోత్తమల  దారుణ అసాంఘిక చర్యలు....                                          అలాంటి ఆడ జాతి పైన అమానుష అత్యాచార ఘటనలు....                                           అలాంటి కన్నతల్లుల మీద ఈ కీరాతకమైన కీచక రాచ క్రీడలు...                                         ఇటువంటి మగ జాతిలో పుట్టినందుకు..మధనపడుతూ...
మగసిరితో మురిసిపోతున్న మృగ మహారాజులకు నా మనవి              

         " బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలచుకో.....                                                                             నవ సమాజపు నది ఒడ్డున ముద్దు బిడ్డలా నిల్చున్న నేడు తలచుకో....                               అది గొడ్డు కాదు ఆడదని నిజం ఇప్పటికైనా తెలుసుకో...." 

మృగాల వలె  కాకా మనుషులవాలే జీవిస్తూ..... మగసిరితో కాకా మానవత్వంతో ముందుకు సాగుతూ, ఇకనుండి అయిన స్త్రీ జాతి సమస్తం కిరాతుకల కబంద హస్తాలలో అస్తమయం కాకుండా పాటుపడదాం. నవ స్త్రీ జాతిలో ధైర్యాన్ని నింపుదాం ..మన భారత దేశ గౌరవాన్ని కాపడుకొందాం ....